పటాన్‌చెరులో రోడ్డుపై ఖరీదైన హస్కీ జాతి శునకాలు.. వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు

  • ఎండ వేడికి తట్టుకోలేక ఒకటి మృతి, పలు కుక్కలకు అస్వస్థత
  • జంతు ప్రేమికుల చొరవతో 8 శునకాలను కాపాడిన వైనం
  • ఘటనపై మిస్టరీ, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • మిగిలిన వాటి ఆచూకీ కోసం వలంటీర్ల గాలింపు
నగర శివార్లలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఖరీదైన సైబీరియన్ హస్కీ జాతికి చెందిన సుమారు 30 నుంచి 40 శునకాలను గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై వదిలివెళ్లారు. ఎండ వేడిమికి తట్టుకోలేక, ఆహారం, నీరు లేక అవి తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. ఈ ఘటనలో ఒక శునకం ప్రాణాలు కోల్పోయింది.

పటాన్‌చెరు-శంకర్‌పల్లి మార్గంలో ఏప్రిల్ 21న గుర్తుతెలియని వ్యక్తులు ఓ కంటైనర్‌లో ఈ శునకాలను తెచ్చి వదిలి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. చల్లని వాతావరణాన్ని ఇష్టపడే ఈ జాతి కుక్కలు, తీవ్రమైన ఎండలకు తాళలేక నీరసించిపోయాయి. వాటి రూపం నక్కలను పోలి ఉండటంతో చాలామంది దగ్గరికి వెళ్లేందుకు భయపడ్డారు.

సమీపంలోని ఓ దుకాణదారుడి సమాచారంతో 'ఆసరా ఫౌండేషన్' సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు వచ్చేసరికే ఎండ నుంచి తప్పించుకునేందుకు కొన్ని కుక్కలు సమీప అడవిలోకి పారిపోగా, మరికొన్నింటిని వాహనదారులు తీసుకెళ్లారు. అక్కడ అస్వస్థతతో పడి ఉన్న 8 శునకాలను వలంటీర్లు రక్షించారు. ప్రస్తుతం వాటిని 'స్వాన్ ఎన్జీవో' సంరక్షణ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అసలు ఇంత పెద్ద సంఖ్యలో ఖరీదైన శునకాలను ఎందుకు వదిలివెళ్లారనేది మిస్టరీగా మారింది. అక్రమ బ్రీడింగ్ కేంద్రాల నిర్వాహకులు అధికారుల తనిఖీల భయంతో వదిలించుకున్నారా? లేక వాటికి ఏమైనా అనారోగ్యం సోకిందా? అనే కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విజయకృష్ణ తెలిపారు. మిగిలిన శునకాల ఆచూకీ కోసం వలంటీర్లు గాలిస్తున్నారు. అవి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 9949872527 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని జంతు పరిరక్షణ సంస్థ ప్రతినిధులు ప్రజలను కోరారు.

Husky Dogs
Abandoned
Patancheru
Hyderabad
Telangana

More Telugu News